ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలనే నేను కోరుకున్నా: జగ్గారెడ్డి

  • మూడు ప్రాంతాలను వైయస్ సమానంగా అభివృద్ధి చేశారు
  • కాంగ్రెస్ పార్టీ ఏపీకి నష్టం చేయలేదు
  • కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరుతున్నా
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలనే తాను ముందు నుంచి కోరుకున్నానని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సమైక్యాంధ్రలో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను దివంగత రాజశేఖరరెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రులు, విడిపోవాలని తెలంగాణ వారు కోరుకున్న మాట నిజమేనని చెప్పారు. జగ్గారెడ్డి ఈరోజు విజయవాడకు వచ్చారు. ఆయనకు ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీకి నష్టం చేయలేదని, అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు కోపం వచ్చిందని జగ్గారెడ్డి చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల మంచే జరుగుతుందని అన్నారు. కులాలు, మతాలను కలుపుకుని పోయే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని... కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరుతున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి టీడీపీ, రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు.

Jagga Reddy
Congress
Andhra Pradesh
Sake Sailajanath

More Telugu News